12 August 2016

టీఆర్ ఎస్ లో వారి బాధ వర్ణణాతీతం

తెలంగాణలో అధికార టీఆర్ ఎస్ పార్టీ నాయకుల్లో గందరగోళం నెలకొంటుంది. కారు జోరు కొనసాగుతున్న సమయంలో అధికార పార్టీలోకి వలసల రూపంలో వచ్చిన నేతల్లో అయోమయం తారాస్థాయికి చేరిందని అంటున్నారు. గతంలో  టీఆర్ ఎస్ లో ఉన్న నాయకులు తమ వారికి న్యాయం చేసుకోలేక ఇబ్బందుల్లో ఉంటే....సార్వత్రిక ఎన్నికల అనంతరం కారెక్కిన నాయకులు తమ అడ్రస్ ఏంటని ప్రశ్నించుకుంటున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇందులో మెజార్టీ నాయకులు తెలుగుదేశం వారుండటం ఆసక్తికరంగా మారింది.

తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్న ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావుతోపాటు రాజ్యసభ ఎంపీ గుండు సుధారాణిలతో పాటు సీనియర్ నేత పాలమూరు జిల్లాకు చెందిన మాజీమంత్రి పి.రాములు గ్రేటర్ హైదరాబాద్ నగరానికి చెందిన కె. విజయ రామారావు వంటి నేతలున్నారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు వరంగల్ జిల్లాకే చెందిన మాజీమంత్రి బస్వరాజ్ సారయ్య వంటి వారున్నారు. గ్రేటర్ హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికలను టీఆర్ ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇతర పార్టీలకు చెందిన నేతలను భారీగా పార్టీలో చేర్చుకుంది. ఇందులో ప్రధానంగా టీడీపీ నుంచి మాజీ మంత్రులు కే విజయరామారావు - సీ కృష్ణాయాదవ్ - ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్ - మాగంటి గోపినాథ్ - సాయన్న - మాధవరం కృష్ణారావు వంటి వారు ఉన్నారు. వీరందరికి రాజకీయంగా ఉన్నత స్థానం కల్పిస్తామని సీఎం కెసిఆర్ తో పాటు పార్టీ సీనియర్ నేతలు హమీ ఇచ్చారు. 

కారెక్కి నెలలు దాటిపోతున్న నేపథ్యంలో పార్టీ మారిన పలువురు నాయకులు పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. కండువా మార్చుకుంటున్న  సందర్బంలో తమకు అధినేత నుండి స్పష్టమైన హమీ ఉందని కొందరు నేతలు పేర్కొంటుంటే మరికొందరు మాత్రం జిల్లా స్థాయిలోనైనా అవకాశాలు రాకపోతాయా అంటు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికి ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాలలో హ్యపీగానే ఉండగా పదవులు లేని సీనియర్ నేతలు మాత్రం తమకెపుడు అవకాశాలు వస్తాయో తెలియక ఎదురుచూస్తున్నారు. నామినేటెడ్ పదవుల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కావడంతో పలు మార్కెట్ - దేవాలయ కమిటీలకు పాలకవర్గాలను నియమిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో పలు కార్పోరేషన్ ఛైర్మన్ పదవులతో పాటు ఎమ్మెల్సీ వంటి పదవులను ఆశించి పార్టీలో చేరిన వారు ఎదురుచూపులతో కాలం వెళ్లదీస్తున్నారని చెప్తున్నారు. పార్టీ అగ్ర నేతలు - మంత్రుల అపాయింట్ మెంట్లు కూడా లభించడం లేదని మరికొందరు నేతలు వాపోతున్నారు. తమతోపాటు వచ్చిన కార్యకర్తలకు కనీసం న్యాయం చేయలేకపోతున్నామని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చర్చ సాగుతోంది.టీఆర్ ఎస్ లో వారి బాధ వర్ణణాతీతం

No comments:

Post a Comment