26 July 2017

టెకీలకు డ్రగ్స్..టీ సర్కారు రియాక్షన్ ఇది

హైదరాబాద్ లో రేకెత్తిస్తున్న డ్రగ్స్ వ్యసనం - ఉపయోగించే దందాలో సినీ పరిశ్రమతో పాటుగా సాఫ్ట్ వేర్ నిపుణులు ఉన్నట్లు తేలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియాలో జోరుగా వార్తలు ప్రసారం అయ్యాయి. ఐటీ రంగంలో డ్రగ్స్ ఉపయోగించడంఫై ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ స్పందించారు. సిట్ విచారణకు బాధ్యత వహిస్తున్న అకున్ సబర్వాల్ ఏ ఏ ఐటీ కంపెనీల ఉద్యోగులు డ్రగ్స్ తీసుకుంటున్నారో లిస్టు ఇచ్చారని జయేశ్ రంజన్ తెలిపారు. అయితే డ్రగ్స్ తీసుకుంటున్న వారి పేర్లు ఇవ్వలేదని వివరించారు. అందుకే ఆయా కంపెనీల ప్రతినిధులతో మాట్లాడుతున్నామని వివరించారు. కొద్ది మందిని ఇక్కడికి పిలిపించుకుంటున్నామని వివరించారు. మరి కొన్ని చోట్లకు తానే వెళ్లి మాట్లాడుతున్నానని జయేశ్ రంజన్ తెలిపారు. రాష్ట్రంలోని కంపెనీలకు ఆయ కంపెనీల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలని కోరినట్లు జయేశ్ రంజన్ వెల్లడించారు. తప్పు చేసిన వారిఫై చర్యలు తీసుకోవాలని చెప్పామని ఆయన వివరించారు. హైదరాబాద్ లో దాదాపుగా 4 లక్షల మంది ఐటీ ఉద్యోగులున్నారని సుమారు 400 కంపెనీ లు ఉన్నాయని ఆయన తెలిపారు. అయితే డ్రగ్స్ తీసుకుంటున్నవారు 20 మంది కూడా లేరని ఆయన అన్నారు. తాజాగా డ్రగ్స్ ఉదంతం తెరమీదకు వచ్చిన నేపథ్యంలో ఐటీ రంగం సంక్షోభం లో పడిందని భావించొద్దని ఆయన కోరారు. ఈ అంశాన్ని బూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి కోరారు. మొత్తం ఐటీ రంగం డ్రగ్స్ తీసుకుంటుందని ప్రచారం చేయడం కరెక్ట్ కాదని ఐటీ శాఖ కార్యదర్శి అన్నారు.

సీఎం సంచలన నిర్ణయం.. రాజీనామా

పట్నా: మిత్రపక్షం ఆర్జేడీతో కొనసాగుతున్న విభేదాల నేపథ్యంలో బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎవరు ఊహించనిరీతిలో బుధవారం ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. సొంత పార్టీ జేడీయూ ఎమ్మెల్యేలతో భేటీ అయిన అనంతరం నేరుగా రాజ్‌భవన్‌కు వెళిన సీఎం నితీశ్‌ తన రాజీనామాను గవర్నర్‌ కేసరినాథ్‌ త్రిపాఠికి అందజేశారు. నితీశ్‌కుమార్‌ రాజీనామాతో బిహార్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది. లాలు ప్రసాద్‌ తనయుడు తేజస్విపై అవినీతి ఆరోపణలు, సీబీఐ కేసు నేపథ్యంలో అధికార మహాకూటమిలో మిత్రపక్షాలైన ఆర్జేడీ, జేడీయూ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. సీబీఐ కేసు నేపథ్యంలో తేజస్వి ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందేనని సీఎం నితీశ్‌కుమార్‌ అల్టిమేటం జారీచేశారు. ఈ అల్టిమేటాన్ని లాలూ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. తన కొడుకు తేజస్వి డిప్యూటీ సీఎం పదవిలో కొనసాగి తీరుతారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఎవరూ ఊహించనిరీతిలో నితీశ్‌ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేసి.. ఆర్జేడీతో దోస్తీని తెగదెంపులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నితీశ్‌కుమార్‌ అడుగులు ఎటువైపు సాగుతాయన్నది ఆసక్తికరంగా మారింది. ఈ వ్యవహారంలో మొదటినుంచి బీజేపీ నితీశ్‌కు అండగా ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ మద్దతుతో నితీశ్‌కుమార్‌ కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశముందని తెలుస్తోంది.

జియో ఫ్రీ ఫోన్లపై షాకింగ్ న్యూస్!

కర్లో దునియా ముట్టీ మే అంటూ రిలయన్స్ పోన్లు కొద్ది సంవత్సరాల క్రితం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం ప్రవేశ పెట్టిన జియో దెబ్బకు మొబైల్ డేటా వాడకంలో 150వ స్థానంలో ఉన్న భారత్ ఏకంగా నెం.1 స్థానానికి ఎగబాకింది. అదే తరహాలో కొద్ది రోజుల క్రితం జియో ఫోన్లను ఫ్రీగా అందించనున్నామని ముకేష్ అంబానీ సంచలన ప్రకటన చేశారు. ఆ ప్రకటనతో భారత టెలికం రంగంలో కలకలం రేపారు. రూ. 1500 డిపాజిట్ చేసి రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్ సొంతం చేసుకుంటే మూడేళ్ల తరువాత ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ ఫ్రీ ఫోన్ల విషయంలో రిలయన్స్ తాజాగా ఓ మెలిక పెట్టింది. రూ. 1500 ఫోన్ పొందిన వినియోగదారులు మూడేళ్ల పాటు ప్రతి నెలా రీచార్జ్ చేసుకుంటేనే పూర్తి మొత్తాన్ని మూడేళ్ల తరువాత వెనక్కు చెల్లిస్తారట. ఒకవేళ మధ్యలో రీచార్జ్ చేసుకోకుంటే పూర్తి మొత్తం ఇవ్వబోమని రిలయన్స్ అధికారులు స్పష్టం చేసినట్టు హెచ్ ఎస్బీసీ వెల్లడించింది. రిలయన్స్ సంస్థ సమావేశం వివరాలను హెచ్ ఎస్బీసీ తాజగా ఓ రిపోర్టులో ప్రచురించింది. జియో ఫోన్ తో పాటే కేబుల్ ప్రసారాలను టీవీలో చూసే సౌకర్యాన్ని కల్పిస్తామని రిలయన్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఫోన్ కేబుల్ తో టీవీ కనెక్ట్ అయి ఉన్నపుడు మాత్రమే టీవీలో ప్రసారాలను చూడవచ్చు. ఫోన్ ను బయటకు తీసుకువెళితే టీవీలో ప్రసారాలు చూడలేం. దీంతో ఈ కేబుల్ ప్లాన్ పక్కాగా ఫెయిల్ అవుతుందని డీటీహెచ్ సంస్థలు భావిస్తున్నాయి. అంతే కాకుండా ఫోన్ ద్వారా కేబుల్ టీవీ కావాలంటే నెలకు రూ. 309 చెల్లించాల్సి ఉంటుంది. అంతకన్నా తక్కువకే సేవలందిస్తూ ఉండడంతో డీటీహెచ్ సంస్థలు దీమాగా ఉన్నాయి.

రూ.2వేల నోటు ప్రింటింగ్ ఆపారా?

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. పెద్ద నోట్లగా చెలామణిలో ఉన్న రూ.500.. రూ.1000 నోట్లను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్న ప్రధాని మోడీ.. ఆ తర్వాత వాటి స్థానంలో రూ.2వేల నోటును తీసుకురావటం తెలిసిందే. కొద్ది రోజులకే రూ.500 నోటును తీసుకొచ్చినా.. వెయ్యి నోటును పునరుద్ధరించలేదు. ఇదిలా ఉండగా.. త్వరలో రూ.200 నోటును తీసుకురావాలన్న నిర్ణయాన్ని మోడీ సర్కారు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ అనుమతి నేపథ్యంలో ఆర్ బీఐ రూ.200 నోట్ల ప్రింటింగ్ ను షురూ చేసింది. అన్ని బాగుంటే ఆగస్టు 15 నాటికి కొత్త రూ.200 నోటును వినియోగంలోకి తీసుకురావాలన్న ఆలోచనలో ఉంది. అయితే.. అనుకున్న రీతిలో ప్రింటింగ్ జరగటం లేదన్న వార్తలు వస్తున్నాయి. ఒకదశలో ఆగస్టు నుంచి దసరా సమయానికి రూ200 నోట్లను తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్న వార్తల స్థానే.. మరో ఆసక్తికర వార్త తెర మీదకు వచ్చింది. సరికొత్తగా తీసుకు వస్తున్న రూ.200 నోట్ల ప్రింటింగ్ ను మరింత వేగవంతం చేసేందుకు వీలుగా రూ.2వేల నోట్ల ప్రింటింగ్ ను నిలిపివేసినట్లుగా సమాచారం. రూ.200 నోట్ల ప్రింటింగ్ ను కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ లో స్టార్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ముందుగా అనుకున్నట్లు ఆగస్టు 15 నాటికి కొత్త రూ.200 నోటను చెలామణిలోకి తెచ్చేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. మరి.. రూ.200 నోట్ల కోసం రూ.2వేల నోట్ల ప్రింటింగ్ ఆపితే.. కొరత ఏర్పడుతుందా? దాని వల్ల జరిగే ఇబ్బంది ఏమిటన్న విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వటం లేదు. మిగిలిన ముచ్చట్లు ఎలా ఉన్నా.. మరో మూడు వారాల వ్యవధిలో కొత్త కొత్త రూ.200 నోటు జేబుల్లోకి రావటం ఖాయమన్నట్లేనా?