12 August 2016

బీజేపీ సీఎం బోణీ చేశారు

వడ్డించే వాడు మనోడైతే ఏ పంక్తిలో కూర్చున్నా భోజనం గ్యారంటీ అంటారు. మోడీ ప్రభుత్వం పట్టుపట్టి ఆమోదింపజేసుకున్న జీఎస్టీ బిల్లు ఇప్పుడు ఇదే సూత్రంపై ఆధారపడి రాష్ట్రాల్లో ఆమోదం పొందడం మొదలుపెట్టింది. అసోంలో ఈ బిల్లుకు ఈ రోజు ఆమోదం పలికారు. ఇంతకాలం కాంగ్రెస్ పాలనలో ఉన్న అసోం మొన్నటి ఎన్నికల తరువాత బీజేపీ పాలనలోకి వచ్చింది. అక్కడ మోడీ సన్నిహితుడు మాజీ కేంద్రమంత్రి శర్వానంద్ సోనోవాల్ ముఖ్యమంత్రయ్యారు. దీంతో జీఎస్టీ బిల్లు అక్కడి శాసనసభలో ఆమోదం పొందడం తేలికైంది. 

సుదీర్ఘ కాలం పెండింగులో ఉన్నా అన్ని అడ్డంకులను తొలగించుకొని రాజ్యసభలో ఆమోదం పొందిన వస్తు సేవలపన్ను(జీఎస్ టీ) బిల్లు లోక్ సభలోనూ ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఈరోజు జీఎస్ టీ బిల్లును అసోం శాసనసభ ఆమోదించి జీఎస్ టీ బిల్లును ఆమోదించిన మొదటి రాష్ట్రంగా నిలిచింది. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఇటీవలే జీఎస్ టీ బిల్లుపై చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఆ ఫలితం అసోంలో మొట్టమొదటగా కనిపించింది.

మూడు నెలల క్రితం బీజేపీ యువ నేత - కేంద్ర మాజీ మంత్రి సర్బానంద సోనోవాల్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. సర్బానంద సోనోవాల్ అసోం శాసనసభలో జీఎస్ టీ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా ట్విట్టర్ లో స్పందించారు. జీఎస్టీ బిల్లుతో అసోం రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నట్లు తాను నమ్ముతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆర్థిక పరంగా తమ రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని ఆయన చెప్పారు. ఇక బీజేపీ పాలనలో ఉన్న మిగతా రాష్ట్రాలు కూడా ఈ బిల్లు ఆమోదానికి తొందరపడనున్నాయి. ఆయా రాష్ర్టాల్లోని శాసనసభలు సమావేశమైతే ఈ ప్రక్రియ వేగవంతం కానుంది. వాటితో పాటు బీజేపీ మిత్రపక్షాల పాలనలోని రాష్ట్రాలూ కూడా అడాప్టు చేసుకోనున్నాయి.

No comments:

Post a Comment